అవమానంగా అనిపిస్తోంది
అవమానంగా అనిపిస్తోంది
ముంబై: అంతా తనను బబ్లీ అని పిలుస్తుంటే అవమానకరంగా అనిపిస్తోందని నటి పరిణీతిచోప్రా మధనపడింది. ‘బబ్లీ అని నన్ను పిలిస్తే నాకు అగౌరవంగా అనిపిస్తోంది. ఇప్పటికి ‘హసీ తో ఫసీ’, ‘ఇషక్‌జాదే, ‘శుద్ధ్ దేశీ రొమాన్స్’, ‘లేడీ వర్సెస్ రికీ బహెల్’’ అనే నాలుగు సినిమాల్లో నటించా. ఒక సినిమాతో మరో సినిమాకి ఎటువంటి పోలికలు లేవు. వాటిల్లో బబ్లీ అనిపించేవిధంగా ఏదీ లేదు. అలా నన్ను సంబోధించడం ఎద్దేవా చేసినట్టుగా అనిపిస్తోంది. అలా పిలిచేవాళ్లంతా మరో సారి నా సినిమాలన్నీ చూడాలి.

ఆ సినిమాలన్నీ చూస్తే వారి అభిప్రాయంలో మార్పు వస్తుంది’ అని అంది. కాగా తాజా సినిమా ‘దావత్-ఎ-ఇష్క్’ సినిమా ప్రచార కార్యక్రమంలో పాల్గొంటున్న పరిణీతిచోప్రా క్షణం తీరిక లేకుండా గడుపుతోంది. ఈ సినిమాకు హబీబ్ ఫైజల్ దర్శకత్వం వహిస్తుండగా ఆదిత్యరాయ్ కపూర్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. ప్రతి సినిమాలోనూ విభిన్నంగా కనిపించేందుకు పరిణీతి తంటాలు పడుతోంది.

 అయితే ఈ రంగంలో తనకు ఎదురవుతున్న పోటీ గురించి మాత్రం పట్టించుకోవడం లేదు. ‘సహ తారలు ఏయే సినిమాల్లో నటిస్తున్నారనే విషయాన్ని ఎంతమాత్రం పట్టించుకోను. గత సినిమాలో కంటే తాజా సినిమాలో విభిన్నంగా కనిపించడానికి మాత్రం ప్రయత్నిస్తా. ప్రతి కథానాయకుడు, కథానాయిక ఒకరికొకరు విభిన్నంగా ఉంటారు. మా అందరికీ విభిన్నమైన పనితీరు ఉంటుంది. అందువల్ల పోటీ పడాల్సిన అవసరమే లేదు.’ అని అంది.

Comments